
ఏజ్ బార్ ఆటగాళ్లను ఆడించవద్దు!
ఏజ్ బార్ అయిన ఆటగాళ్లు అండర్-17, అండర్-19 విభాగాలలో ఉన్నారని దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బీఏఐ)ను వివరణ అడిగింది.
న్యూఢిల్లీ: ఏజ్ బార్ అయిన ఆటగాళ్లు అండర్-17, అండర్-19 విభాగాలలో ఉన్నారని దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బీఏఐ)ను వివరణ అడిగింది. వయసు దాటినా అదే విభాగాలలో భారత్ తరఫున ఆడటం సబబేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల కేరళలో నిర్వహించిన జాతీయ క్రీడల్లో అండర్-17, అండర్-19 బాలురు, బాలికల విభాగాలలో ఓవర్ ఏజ్ ప్లేయర్స్ ఉన్నారన్న ఆరోపణలపై జూలై 19లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.
15 ఏళ్ల వయసున్న తన కుమారుడిని 19 ఏళ్లకు పైగా ఉన్న ఇద్దరు ఆటగాళ్లు ఓడించటంతో ట్రయల్స్ లోనే ఇంటిబాట పట్టాడని ఇస్సాక్ పాల్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. తప్పుడు వయసు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కొందరు గేమ్స్ ఆడుతున్నారని కోర్టును ఆశ్రయించాడు. పిటీషనర్ ఆరోపణలు నిజమని తేలితే ఆ క్రీడాకారులపై చర్యలు తీసుకోవడంతో పాటు మరోసారి వాళ్లు తర్వాతి టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా చూడాలని క్రీడా మంత్రిత్వశాఖ గతంలో పేర్కొంది.