మళ్లీ బ్యాట్‌ పట్టిన ధావన్‌

Dhawan Picks Up Bat For The First Time After Injury - Sakshi

ముంబై: గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి అర్దంతరంగా తప్పుకున్న టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టాడు. ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని ధావన్‌.. యువరాజ్‌ సింగ్‌ విసిరిన చాలెంజ్‌ కోసం బ్యాట్‌ పట్టి విజయం సాధించాడు. యువీ విసిరిన ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’ను ధావన్‌ స్వీకరించాడు. చాలెంజ్‌లో భాగంగా తనదైన శైలిలో బ్యాట్‌తో బంతిని బాటిల్‌ను కొట్టి క్యాప్‌ను కిందపడేశాడు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘యువీ.. ఇది నా బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌. గాయం తర్వాత తొలిసారి బ్యాట్‌ పట్టాను. చాలా ఆనందంగా ఉంది’అంటూ వీడియో కింద పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయాన్ని లెక్క చేయకుండా శతకాన్ని సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే గాయం నుంచి కోలుకోవడానికి ఐదారు వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలపడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. ఐసీసీ వంటి మెగా టోర్నీల్లో రెచ్చిపోయే ధావన్‌ ప్రపంచకప్‌లో లేకపోవడం టీమిండియాను దెబ్బతీసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో జట్టులో సీనియర్‌ లెఫ్టాండ్‌ బ్యాట్స్‌మన్‌ లేని లోటు స్పష్టంగా తెలిసింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెస్టిండీస్‌ పర్యటనకు కూడా ధావన్‌కు విశ్రాంతినిచ్చారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top