ఐపీఎల్‌కు కావేరి సెగ | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు కావేరి సెగ

Published Tue, Apr 10 2018 8:52 AM

Cauvery Threat To Chennai IPL Matches - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాట కావేరి నది జలాల వివాదం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు తాకనుంది. చెన్నైలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను అడ్డగిస్తామని పలు రాజకీయ కూటమిల ప్రకటనలతో చెపాక్‌ స్టేడియంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

దాదాపు 4 వేల మంది పోలీసులు మంగళవారం చెన్నై-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌కు భద్రత కల్పిస్తున్నారు. కావేరి నదీ జలాల బోర్డును మళ్లీ ఏర్పాటు చేయాలని తమిళ రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో భాగంగా చెన్నైలో జరుగుతున్న ఏడు మ్యాచ్‌లను రద్దు చేయాలని కూడా పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. సూపర్‌స్టార​ రజనీకాంత్‌ ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడే ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని కోరారు. మరోవైపు మ్యాచ్‌కు వెళ్లకుండా అభిమానులు తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని కూడా పిలుపునిచ్చారు.

కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించిన కావేరి నది సింహభాగం తమిళనాడులో ప్రవహిస్తుంది. అంతేకాకుండా సాగు కోసం కావేరి నదీ జలాలపైనే కర్ణాటక, తమిళనాడు ప్రజలు ఆధారపడుతున్నారు. కావేరి నదీ జలాల బోర్డు కావేరి నుంచి లభ్యమయ్యే 700లకు పైచిలుకు టీఎంసీల నీటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో 15 ఏళ్ల పాటు అమలయ్యేలా కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలకు కేటాయింపులు చేసింది.

గత కేటాయింపుల కంటే 14 టీఎంసీల నీటిని కర్ణాటకకు సుప్రీం ఎక్కువగా ఇవ్వడంతో ఈ వివాదం రాజుకుంది.

Advertisement
Advertisement