పసిడి పోరుకు ప్రసాద్‌ | Boxer Lalita Prasad fight for gold medal | Sakshi
Sakshi News home page

పసిడి పోరుకు ప్రసాద్‌

Feb 27 2019 1:19 AM | Updated on Feb 27 2019 1:19 AM

 Boxer Lalita Prasad fight for gold medal - Sakshi

చబహార్‌ (ఇరాన్‌): కొత్త సీజన్‌లోని రెండో అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌ మక్రాన్‌ కప్‌లోనూ భారత బాక్సర్లు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఏకంగా ఆరుగురు బాక్సర్లు ఈ టోర్నమెంట్‌లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్, ప్రస్తుత జాతీయ చాంపియన్‌ పొలిపల్లి లలితా ప్రసాద్‌ (52 కేజీలు)తోపాటు దీపక్‌ సింగ్‌ (49 కేజీలు), సంజీత్‌ (91 కేజీలు), దుర్యోధన్‌ సింగ్‌ నేగి (69 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (60 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు.

 సెమీఫైనల్లో వైజాగ్‌కు చెందిన ప్రసాద్‌ 5–0తో మార్విన్‌ తొబామో (ఫిలిప్పీన్స్‌)ను చిత్తుగా  ఓడించాడు. నిర్ణీత మూడు రౌండ్లలోనూ ప్రసాద్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇతర సెమీఫైనల్స్‌లో మనీశ్‌ కౌశిక్‌ 4–1తో అష్కన్‌ రెజాయ్‌పై, సతీశ్‌ 5–0తో ఇమాన్‌ రమజాన్‌పై, దీపక్‌ 5–0తో మాలిక్‌ అమారిపై, సంజీత్‌ 5–0తో పుర్యా అమీరిపై, అలీ మొరాదీపై దుర్యోధన్‌ సింగ్‌ విజయం సాధించారు. అయితే రోహిత్‌ టొకాస్‌ (64 కేజీలు), మంజీత్‌ సింగ్‌ పంగల్‌ (75 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. గతవారం బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచారు.    

Advertisement
 
Advertisement
Advertisement