బీసీసీఐపై మాజీల విమర్శలు | Sakshi
Sakshi News home page

బీసీసీఐపై మాజీల విమర్శలు

Published Sun, Dec 6 2015 1:02 PM

బీసీసీఐపై మాజీల విమర్శలు

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై మాజీ ఆటగాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. బీసీసీఐలో రాజకీయ నాయకులు అధికంగా ఉన్న కారణంగానే బోర్డులో పారదర్శకత లోపించిందంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ఎద్దేవా చేశారు. భారత్ లో క్రికెట్  మరింత ప్రొఫెషనల్ గా ఎదగాలంటే బీసీసీఐ కమిటీల్లో రాజకీయ నాయకులకు స్వస్తి పలకాల్సిందేనని చాపెల్ పేర్కొన్నారు. బీసీసీఐలో రాజకీయ నాయకులు లేకుండా సరికొత్త కమిటీ ఏర్పాటు చేస్తే ప్రజా విశ్వాసాన్ని పొందే అవకాశం ఉందన్నారు.

 

శనివారం ఓ ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక నిర్వహించిన 'లీడర్ షిప్'సమ్మిట్ లో ఇయాన్ చాపెల్ తో పాటు, భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ,  గౌతం గంభీర్, రిటైర్డ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇయాన్ తనదైన శైలిలో వ్యంగస్త్రాలు సంధించారు. బీసీసీఐలో రాజకీయాలు అధికంగా ఉండటం వల్ల పారదర్శకత లోపించదన్నాడు. వాటి నుంచి బయటపడాలంటే రాజకీయాలకు అతీతంగా ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అందరూ పాటిస్తున్న అంపైర్ నిర్ణయ సమీక్ష(డీఆర్ఎస్) పద్దతిని బీసీసీఐ వ్యతిరేకించడాన్నిచాపెల్ తప్పుబట్టారు. ప్రపంచంలోని ఇతర క్రికెట్ దేశాలు వ్యవహరించే తీరు ఒక ఎత్తయితే.. బీసీసీఐ  అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుందన్నారు. ఇదిలా ఉండగా, బిషన్ సింగ్ బేడీ కూడా బీసీసీఐ తీరుపై మండిపడ్డారు. బీసీసీఐలో జవాబుదారీతనం అసలు లేదని బేడీ విమర్శించారు. బీసీసీఐలో పారదర్శకతను ఒకటి నుంచి పది వరకూ కొలిస్తే కచ్చితంగా సున్నానే వస్తుందన్నారు. ఇది చాలా ఆందోళన కల్గించే అంశంగా బేడీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement