అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ మెరుపులు

Axar shines As India C Thrashes India B - Sakshi

రాంచీ: తొలుత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (61 బంతుల్లో 98 నాటౌట్‌; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు... అనంతరం లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే (4/25) మాయాజాలం... వెరసి దేవధర్‌ ట్రోఫీలో భారత్‌ ‘సి’ రెండో విజయం నమోదు చేసింది. భారత్‌ ‘బి’తో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘సి’ 132 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్‌ ‘సి’ 50 ఓవర్లలో 5 వికెట్లకు 280 పరుగులు చేసింది. అక్షర్, విరాట్‌ సింగ్‌ (96 బంతుల్లో 76 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు అజేయంగా 18.4 ఓవర్లలో 154 పరుగులు జోడించడం విశేషం.

భారత ‘బి’ జట్టులో ఏకంగా ఎనిమిది మంది బౌలింగ్‌ చేయడం గమనార్హం. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ‘బి’ మయాంక్‌ మార్కండే, ఇషాన్‌ పోరెల్‌ (2/33), జలజ్‌ సక్సేనా (2/25) దెబ్బకు 43.4 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. బాబా అపరాజిత్‌ (90 బంతుల్లో 53; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. భారత్‌ ‘సి’, ‘బి’ జట్ల మధ్య సోమవారం ఫైనల్‌ జరుగుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top