
సాక్షి, ఇండోర్ : భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో అరోన్ ఫించ్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 294 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ లు శుభారంభాన్ని అందించారు. ఈ జోడి కుదురుగా ఆడుతూ ఆసీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేసింది. అయితే వార్నర్(42;44 బంతుల్లో 4 ఫోర్లు 1సిక్స్) పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫించ్కు జత కలిశాడు. వీరిద్దరూ కలిసి ఎటువంటి తడబాటు లేకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఫించ్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆపై జోరు పెంచిన ఫించ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
అరోన్ ఫించ్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 124 పరుగులు చేసిన అనంతరం రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో 154 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికే స్మిత్(63) కూడా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్(5), ట్రావిస్ హెడ్లు(4) విఫలమయ్యారు. చివర్లో స్టోయినిస్(27) రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఒక దశలో 300 పైచిలుకు పరుగులు చేస్తుందనుకున్న సమయంలో భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆసీస్ మిడిలార్డర్ మరోసారి చేతులెత్తేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రాలకు రెండు, చాహల్, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.





