‘ఖేల్‌రత్న’కు అంజుమ్‌ నామినేట్‌  | Anjum Moudgil Nominated For Khel Ratna Award | Sakshi
Sakshi News home page

‘ఖేల్‌రత్న’కు అంజుమ్‌ నామినేట్‌ 

May 15 2020 2:57 AM | Updated on May 15 2020 2:57 AM

Anjum Moudgil Nominated For Khel Ratna Award - Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రైఫిల్‌ షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ను అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’కు నామినేట్‌ చేసినట్లు భారత జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) గురువారం ప్రకటించింది. యువ షూటర్లను మెరికల్లా తీర్చిదిద్దుతోన్న ప్రముఖ కోచ్‌ జస్పాల్‌ రాణాను ఈ సారీ ‘ద్రోణాచార్య’ అవార్డు బరిలో ఉంచినట్లు తెలిపింది. వీరితో పాటు పిస్టల్‌ షూటర్లు సౌరభ్‌ చౌదరీ, అభిషేక్‌ వర్మ, మను భాకర్‌... రైఫిల్‌ షూటర్‌ ఎలవనీల్‌ వలరివన్‌ పేర్లను ‘అర్జున’ అవార్డు కోసం కేంద్ర క్రీడా శాఖకు సిఫార్సు చేసింది.

అర్హులైన అత్యుత్తమ షూటర్లనే అవార్డుల కోసం నామినేట్‌ చేశామని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు రణీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. చండీగఢ్‌కు చెందిన 26 ఏళ్ల అంజుమ్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఇప్పటికే టోక్యో బెర్తు సాధించింది. షూటింగ్‌లో సంచలనాలు నమోదు చేస్తోన్న టీనేజ్‌ షూటర్లు మను భాకర్, సౌరభ్, అనీశ్‌ భన్వాలాలను... ప్రపంచ స్థాయి షూటర్లుగా తీర్చిదిద్దిన 43 ఏళ్ల జస్పాల్‌ రాణా ఈసారి ద్రోణాచార్య పురస్కారాన్ని ఆశిస్తున్నారు. గతేడాదే రాణాకు ద్రోణాచార్య దక్కకపోవడంతో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా సెలక్షన్‌ ప్యానల్‌ను బహిరంగంగా విమర్శించాడు.    

Advertisement
 
Advertisement
Advertisement