మెరిసిన శశికాంత్, స్టీఫెన్‌ | Andhra Team And Rajasthan Team Ranji Trophy At Jaipoor | Sakshi
Sakshi News home page

మెరిసిన శశికాంత్, స్టీఫెన్‌

Jan 4 2020 2:06 AM | Updated on Jan 4 2020 2:06 AM

Andhra Team And Rajasthan Team Ranji Trophy At Jaipoor - Sakshi

జైపూర్‌: పేస్‌ బౌలర్లు కోడిరామకృష్ణ వెంకట శశికాంత్‌ (4/50), చీపురుపల్లి స్టీఫెన్‌ (4/67) మరోసారి చెలరేగడంతో... రాజస్తాన్‌తో శుక్రవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లో తొలి రోజు ఆంధ్ర జట్టు పైచేయి సాధించింది. ఆంధ్ర బౌలర్ల ధాటికి రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లకు 82 పరుగులు చేసింది. ప్రస్తుతం ఓపెనర్‌ జ్ఞానేశ్వర్‌ (32 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), రికీ భుయ్‌ (10 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రశాంత్‌ కుమార్‌ (31; 5 ఫోర్లు), కెపె్టన్‌ హనుమ విహారి (0) అవుటయ్యారు. మరో 70 పరుగులు చేస్తే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభిస్తుంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ కుదురుగా కనిపించలేదు. అశోక్‌ మేనరియా (74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తప్ప మిగతా  బ్యాట్స్‌మెన్‌ ఇలా వచ్చి అలా వెళ్లారు. తాజా రంజీ సీజన్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం శశికాంత్, స్టీఫెన్‌లకు ఇది నాలుగోసారి కావడం విశేషం. హైదరాబాద్‌ వేదికగా కేరళతో ఆరంభమైన మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ బౌలర్లు ఆకట్టుకున్నారు. రవి కిరణ్‌ (3/24), సిరాజ్‌ (2/36) రాణించడంతో కేరళ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అంతకుముందు రోజు నగరంలో కురిసిన భారీ వర్షంవల్ల మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభమైంది.

అంపైర్‌తో గిల్‌ వాగ్వాదం...
ఢిల్లీతో రంజీ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్, భారత ‘ఎ’ జట్టు కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తనను అవుట్‌గా ప్రకటించిన ఫీల్డ్‌ అంపైర్‌తో గొడవకు దిగి విమర్శల పాలైయ్యాడు. గిల్‌ తన వ్యక్తిగత స్కోరు 10 వద్ద ఢిల్లీ మీడియం పేసర్‌ సుబోధ్‌ భాటి బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీనిపై ఫీల్డర్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ మొహమ్మద్‌ రఫీ... గిల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన గిల్‌ అంపైర్‌ వద్దకు నేరుగా వెళ్లి బ్యాట్‌కు బంతి తగలలేదంటూ గొడవకు దిగాడు. దీంతో ఆ అంపైర్‌ స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌ పశి్చమ్‌ పాఠక్‌ను సంప్రదించి తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నాడు. ఈ గొడవ కారణంగా మ్యాచ్‌ దాదాపు 10 నిమిషాల పాటు నిలిచిపోయింది. అయితే గిల్‌ మరో 13 పరుగులు మాత్రమే జోడించి అవుట్‌ కావడం గమనార్హం. గిల్‌ ప్రవర్తనపై తాము మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయడం లేదని ఢిల్లీ జట్టు మేనేజర్‌ వివేక్‌ ఖురానా, ఢిల్లీ క్రికెట్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తిహారా తెలిపారు.

మహారాష్ట్ర 44 ఆలౌట్‌
సర్వీసెస్ తో జరుగుతోన్న గ్రూప్‌ ‘సి’ రంజీ మ్యాచ్‌లో మహారాష్ట్ర 44 పరుగులకే కుప్పకూలింది. రంజీ చరిత్రలో మహారాష్ట్ర జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. 1941–1942 సీజన్‌లో నవా నగర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర 39 పరుగులకే ఆలౌటైంది. సర్వీసెస్‌ బౌలర్‌ పూనమ్‌ పునియా 5 వికెట్లతో చెలరేగాడు. ఆట ముగిసే సమయానికి సర్వీసెస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 141 పరుగులు చేసి 97 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement