ఆంధ్రప్రదేశ్‌కు మూడోస్థానం

Andhra Pradesh Gets third place in National Kho Kho Championship - Sakshi

 కేరళ, తమిళనాడు జట్లకు టైటిల్స్‌

 జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ సౌత్‌జోన్‌ జాతీయ ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచింది. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో కేరళ బాలికల జట్టు, తమిళనాడు బాలుర జట్టు విజేతలుగా నిలిచాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో తమిళనాడు 12–11తో కేరళపై గెలుపొందింది. బాలికల టైటిల్‌ పోరులో కేరళ 11–7తో కర్ణాటకను ఓడించింది. బాలికల విభాగంలో కర్ణాటక... బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచాయి.

ఈ టోర్నీ ఆసాంతం రాణించిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు నితీశ్‌ ‘బెస్ట్‌ చేజర్‌’ అవార్డును అందుకున్నాడు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 6 రాష్ట్రాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top