అదితిరావ్‌కు మళ్లీ లక్కీచాన్స్‌!

Is Aditi Rao Hydari teaming up with Mani Ratnam again? - Sakshi

తమిళసినిమా: మణిరత్నం చిత్రంలో మరోసారి నటించడానికి నటి అదితిరావ్‌ హైదరి సిద్ధమవుతోంది. ఇంతకు ముందు మణరత్నం తెరకెక్కించిన కాట్రువెలియిడై చిత్రంలో కార్తీకి జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా తన తాజా చిత్రంలో అదితిరావ్‌ను మణిరత్నం తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ ప్రఖ్యాత దర్శకుడు తన తాజా చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కథా చర్చల కోసమే చాలా కాలం తీసుకున్నారు. అంతే కాదు చిత్రంలో పలువురు స్టార్‌ హీరోలను నటింçపజేస్తున్నారు. ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో ఇప్పటికే విజయ్‌సేతుపతి, శింబు, ఫాహద్‌ ఫాజిల్, అరవిందస్వామి, జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్‌లను ఎంపిక చేశారు.

తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావ్‌ కూడా ఈ జాబితాలో చేరిందని సమాచారం. అయితే ఈ అమ్మడు చిత్రంలో ఏ హీరోతో రొమాన్స్‌ చేయనుందన్నది తెలియాల్సి ఉంది. అదే విధంగా చిత్ర వివరాలను దర్శకుడు మణిరత్నం ఇంకా అధికారిక పూర్వంగా ప్రకటించలేదన్నది గమనార్హం. ఇక సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ ఫస్ట్‌కాపీ విధానంతో మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నిర్మించడానికి సిద్ధమైంది. అయితే గత డిసెంబర్‌లోనే ఈ భారీ చిత్రం సెట్‌ పైకి వెళ్లాల్సింది. కారణాలేమైనా షూటింగ్‌ ఆలస్యమైంది. త్వరలోనే చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం శింబు గెడ్డం, మీసం పెంచి చాలా డిఫరెంట్‌గా కనిపించడానికి రెడీ అయ్యారు.

Read latest South India News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top