పిట్టల్లా రాలిపోతున్నా పట్టదా? | YV Subba Reddy Slams Cm Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Aug 22 2018 8:05 PM | Updated on Aug 22 2018 9:21 PM

YV Subba Reddy Slams Cm Chandrababu Naidu - Sakshi

ఫ్లోరైడ్‌ బాధితులు పిట్టల్లా రాలుతున్న పట్టించుకోరా? అని ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

సాక్షి, మార్కాపురం (ప్రకాశం జిల్లా) : జిల్లాల్లో ఫ్లొరైడ్‌ బాధితులు పిట్టల్లా రాలుతున్న పట్టించుకోరా? అని రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ సాధన కోసం ఆయన కనిగిరి నుంచి ప్రజా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఈ పాదయాత్ర మార్కాపురం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్‌ను మూలన పడేసిన దుర్మార్గుడు సీఎం చంద్రబాబు అని మండిపడ్డారు. జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని, తాగడానికి నీళ్లు లేవని ప్రజలు తనతో వాపోతున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. మర్కాపురానికి నీళ్లు ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రో ప్రజలకు తమ అధినేత వైఎస్‌ జగన్‌ భరోసా కల్సిస్తున్నారని చెప్పారు. రాజన్న తనయుడిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రత్యేక హోదా సాధించుకుందామని, అలాగే వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు. జగన్‌ నాయకత్వంలోనే వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసుకుందామన్నారు.

ఆయన పాదయాత్రకు సంఘీభావంగా ఎమ్మెల్యేలు జంకే వెంటకట్‌ రెడ్డి, ఆదిములపు సురేశ్‌, ఎమ్మేల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, కేపీ కొండా రెడ్డి, చెంచు గరటయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు అంటే మోసమని, ఆయనకు ప్రాజెక్టులు కట్టడం ఇష్టం లేదని వెల్లంపల్లి మండిపడ్డారు. టీడీపీకి ప్రజాసమస్యలు పట్టవని, కళ్లు ఉండి చూడలేని గుడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే ఆదిములపు సురేశ్‌ ఫైర్‌ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను నిర్లక్షం చేసిన సీఎం చంద్రబాబుపై ప్రకాశం జిల్లా ప్రజలు కక్ష్య గట్టారని, వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్రాంతికి వెలిగొండ నీళ్లు ఇస్తామన్న చంద్రబాబు మాటలు.. నీటి మీద రాతలని ఉమ్మారెడ్డి ఎద్దేవా చేశారు. రైతులు, యువత సమస్యలు చంద్రబాబుకు పట్టవని, రాజకీయ అవసరాలే చంద్రబాబుకు ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తుకు బాబు తాపత్రయం సిగ్గు చేటని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement