ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయండి..

అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి వైఎస్‌ఆ సీపీ పిటిషన్‌

సాక్షి, విజయవాడ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి ... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ పిటిషన్‌ ఇచ్చింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు బుధవారం పిటిషన్‌ను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ...‘ వైఎస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యే ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలి. చంద్రబాబు నాయుడు పోలవంరం నుంచి రాజధాని వరకూ అన్నింటా అవినీతి చేస్తూ దోచుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారు.

23మందిపై అనర్హత పిటిషన్‌ ఇచ్చాం, స్పీకర్‌ చర్యలు తీసుకోవాలి. రాజ్యసభలో ఒక ఎంపీ వేరో పార్టీ ర్యాలీలో పాల్గొంటేనే చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ స్వయంగా చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదు. అసెంబ్లీ స్పీకర్‌ ధృతరాష్ట్రుడిలా పాలిస్తున్నారు. అన్ని పక్షాలను సమంతరంగా చూడాల్సిన స్పీకర్‌ చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారు. తక్షణమే గిడ్డి ఈశ్వరితో సహా ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top