800 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర | YS Jagan Completes 800 Kms in PrajaSankalpaYatra | Sakshi
Sakshi News home page

800 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర

Jan 11 2018 1:03 AM | Updated on Jul 25 2018 5:02 PM

YS Jagan Completes 800 Kms in PrajaSankalpaYatra - Sakshi

పాతగుంట వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం చిత్తూరు జిల్లాలో 800 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. ఈ సందర్భంగా వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లి గ్రామం వద్ద ఆయన ఓ మొక్కను నాటారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ వద్ద నుంచి ప్రారంభమైన పాదయాత్ర కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకుని గత నెల 28న చిత్తూరు జిల్లాలో ప్రవేశించింది. ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.

58వ రోజు బుధవారం సాయంత్రానికి 804.4 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. కొండలు.. కోనలు.. అడవులు.. కరువు నేలల మీదుగా పాదయాత్ర సాగిస్తున్న జగన్‌కు అడుగడుగునా ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ కష్టాలు వినే నాయకుడొచ్చాడని  ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు జగన్‌ను చూడాలని, ఆయనకు తమ సమస్యలు చెప్పుకోవాలని గంటల తరబడి వేచి చూస్తున్నారు. యువకుల కేరింతలు.. అవ్వాతాతల ఆశీర్వచనాలు.. అక్కాచెల్లెళ్ల ఆత్మీయత నడుమ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. దగా పడిన ప్రజలు, ఉపాధి లేక వీధిన పడ్డ యువకులు, పింఛను అందని దివ్యాంగులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందని విద్యార్థులు జననేతకు అర్జీలు సమర్పిస్తున్నారు.
 
అడుగడుగునా నివేదనలు.. 
తంబళ్లపల్లి నియోజకవర్గంలోని తంబళ్లపల్లి, కురబలకోట మండలాల్లోని ప్రజలు కరువు వల్ల పడే ఇబ్బందులను జననేతకు చెప్పుకున్నారు. ఉపాధి అవకాశాలు లేక, పొట్టనిండక పొరుగు రాష్ట్రాలకు పరుగులు తీయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోని ప్రజలు తమకు పింఛన్లు, వైద్యం, ఇళ్లు అందడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. కల్లూరు మండలంలో బీడీ, చింతపండు కార్మికులు వారు పడుతున్న కష్టాలను జననేతకు వివరించారు.

పింఛన్‌ ఇవ్వడం లేదని, ఇల్లు మంజూరు చేయలేదని పెద్ద సంఖ్యలో పేదలు జగన్‌కు  చెప్పుకున్నారు. రుణమాఫీ కాలేదని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు.. మాఫీ సొమ్ము వడ్డీకి కూడా సరిపోలేదని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాల ద్వారా అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.  వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ కిందకు చేరుస్తామని, పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం ఎంత ఖర్చు అయినా భరిస్తామని జగన్‌ బహిరంగ సభల్లో చెబుతున్నపుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement