
పెరంబూరు: నటుడు రజనీకాంత్ మద్దతు తనకుంటుందని నమ్ముతున్నానని నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ అన్నారు. ఈయన తిరుచ్చి నుంచి శుక్రవారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను సినిమా డైలాగులు చెబుతున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్రాజన్ విమర్శిస్తున్నారని అది ఆమె భావన అని అన్నారు. తమ పార్టీకి గ్లామర్ అవసరం లేదని, నిజాయితీ, భావోద్రేకాలే ముఖ్యం అని, ఆ దిశగానే తాము ముందుకు వెళుతున్నామని అన్నారు.
తమ పార్టీ ఎన్నికల ప్రకటనను త్వరలోనే వెల్లడించనున్నట్లు అందుకు తొందరపడాల్సిన అవసరం లేదని అన్నారు. అలా లక్ష్యం అంటూ ఏదేదో చెప్పుకునేవారు ఇంకా వాటిని పాఠించడం లేదన్నారు. తాను చేయగలిగిందీ, చేయబోయేది మాత్రమే చెబుతానని అన్నారు. ఇతర పార్టీల వారు తమ బలాన్ని చెప్పుకోవడానికే కూటమిలను ఏర్పరచుకుంటున్నారన్నారు. తమకు ప్రజలే బలం ఉందన్నారు. ప్రజలతోనే తమ కూటమి అని ఆ ప్రయత్నంలోనే ఉన్నామన్నారు. ఎవరితో కలిస్తే నోట్లు వస్తాయి, ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఓట్లు పడతాయన్న ఆలోచనతో కాకుండా ప్రజల మంచి కోసమే తమ పార్టీ అన్న విషయం వారికి అర్థం అవుతోందన్నారు.
మూడో కూటమి ఏర్పాటు చేస్తానని అనలేదు
తమిళనాడులో మూడో కూటమి ఏర్పాటు చేస్తామని తానెప్పుడూ అనలేదన్నారు. తాము ఒక కూటమి అనే చెబుతున్నానన్నారు. దాన్ని మీరు 3వ కూటమి అని అర్థం చేసుకున్నట్టున్నారని పేర్కొన్నారు. తమకు ప్రజల మద్దతు ఉందని నమ్ముతున్నామని, అందుకే ఇప్పటికీ ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని అన్నారు. అయితే తమతో నిజాయితీపరులు చేరవచ్చునని పిలుపునిచ్చారు. ఇందులో స్వలాభమో, యుక్తో లేదని అన్నారు. రజనీకాంత్, సీమాన్ వంటి వారి మద్దతు తమకు ఉంటుందని నమ్ముతున్నానని అన్నారు. తమ పార్టీకు చెందిన పోటీదారులకు దరఖాస్తులను శనివారం విడుదల చేయనున్నట్లు కమల్హాసన్ వెల్లడించారు.
ప్రధాని రావాలి
ప్రధాని రాష్ట్రానికి రావడాన్ని వ్యతిరేకిస్తారా? అని అడుగుతున్నారని, నిజానికి ప్రధానమంత్రి రాష్ట్రానికి రాకపోతే ప్రశ్నించాలి గాని, వస్తే వ్యతిరేకించడం ఎందుకన్నారు. ప్రధాని రాష్ట్రానికి రావాలని, అప్పుడే రాష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఎందుకు రాలేదని అందరూ ప్రశ్నించాలని కమల్ అన్నారు.