
మాట్లాడుతున్న కడప పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు సురేష్బాబు
కడప కార్పొరేషన్: ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర ఈనెల 28వ తేదికి 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుతున్న సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ పేరుతో రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి, కడప పార్లమెంటు అధ్యక్షుడు కె. సురేష్బాబు తెలిపారు. సోమవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎస్బీ అంజద్బాషా, పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వాప్తంగా 700 ప్రదేశాల్లో, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ఈ పాదయాత్ర సాగుతుందని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలుపుతూ పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించాలని సూచించారు. జిల్లా కేంద్రమైన కడపలో పాత కలెక్టరేట్ వద్దనున్న వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.