
అమరావతి ,కంకిపాడు (పెనమలూరు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మహానేత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సోమవారం జిల్లాలోని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లోనూ ‘వాక్ విత్ జగన్’ పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ మచిలీ పట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. కంకిపాడు మండలం, ఈడుపుగల్లు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి మండలంలోనూ పార్టీ శ్రేణులు రెండు కిలోమీటర్లు పాదయాత్రను చేపట్టి విజయవంతం చేయాలన్నారు. కాల్వగట్ల వాసులకు అండగా, పింఛన్ల మంజూరు, పక్కా గృహాలకు అనుమతులు, ఇళ్లస్థలాల సమస్యలు, రుణమాఫీ అమలులో వివక్ష తదితర అంశాలపై బాధితుల వద్ద వివరాలు తెలుసుకుంటూ ఈ పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు.
టీడీపీ పాలనలో వంచనకు గురైన ప్రజలు ఈ పాదయాత్రకు మద్దతు తెలపాలని విజ్ఞప్తిచేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు కంకిపాడు సినిమాహాలు సెంటరులో పాదయాత్ర ప్రారంభమై గన్నవరం రోడ్డు, పునాదిపాడు, గొల్లగూడెం మీదుగా కోలవెన్ను చేరుతుందన్నారు. అనంతరం ఉయ్యూరు, సాయంత్రం 4 గంటలకు పెనమలూరు పప్పుల మిల్లు సెంటరు నుంచి కాల్వ కట్ల మీదుగా పాదయాత్ర సాగుతుందని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, జిల్లా నాయకులు పర్వతనేని వెంకట కృష్ణారావు, మాదు వసంతరావు, బాకీ బాబు, ఎస్సీ, బీసీ విభాగాల మండల అధ్యక్షులు కలపాల వజ్రాలు, నకరికంటి శేఖర్, బండారు సంసోన్, పెనమలూరు మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు, కాళిదాసు పాల్గొన్నారు.