రుణమాఫీ కాలేదని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు

Thopudurthy Prakash Reddy Slams Chandrababu In Anantapur - Sakshi

రాప్తాడు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాప్తాడు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా అంగీకరించినా మొత్తం మాఫీ చేసినట్లు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో తోపుదుర్తి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు జరిపే జిల్లా పర్యటనలు వృధా అని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని తీవ్రంగా దుయ్యబట్టారు. అనంతలో లక్ష ఇంకుడు గుంతల నిర్మాణం బోగస్‌ అని వెల్లడించారు.

యంత్రాలతో ఉపాధి పనులు చేసి టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 4.3 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు కర్నాటక నుంచి రావాలి కానీ చంద్రబాబు, ఆయన మంత్రులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. హంద్రినీవా నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు తరలించే సాకుతో 968 కోట్ల రూపాయల పనులు చేపట్టడం భావ్యమా అని ప్రశ్నించారు. మంత్రి కాలువ శ్రీనివాస్‌కు దోచిపెట్టేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారని ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top