అజిత్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన సుప్రియా

Supriya Sule welcomes Ajit Pawar with a hug - Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అసెంబ్లీ వద్ద కోలాహలం నెలకొంది. ముందుగానే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న ఎన్సీపీ నేత సుప్రియా సూలె పలువురు నేతలకు సాదర స్వాగతం పలికారు. మొదట శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు ఆమె స్వాగతం పలికారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవడంతో ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

ఆ తర్వాత ఎన్సీపీ సీనియర్‌ నేత, తన సోదరుడు అజిత్‌ పవార్‌ వచ్చారు. అజిత్‌ను కూడా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ స్వాగతం పలికారు. పార్టీ అధినేత శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ చివరినిమిషంలో మనస్సు మార్చుకొని తిరిగి ఎన్సీపీ గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఫడ్నవిస్‌తో మర్యాదపూర్వకంగా సుప్రియా సూలె కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సుప్రియా సూలె మాట్లాడుతూ.. తమ సంకీర్ణ ప్రభుత్వం మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలంతా తమకు అండగా నిలబడ్డారని అన్నారు.
చదవండి: ఉద్దవ్‌ ఠాక్రేకే పీఠం..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top