కాంగ్రెస్‌ లేకుండానే ఎస్పీ, బీఎస్పీ కూటమి

SP-BSP alliance to leave just two seats for Congress party - Sakshi

లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కలిసి పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్‌పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ)లు నిర్ణయించుకున్నాయి. అయితే, ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ లేకుండానే ఈ కూటమి రూపుదాల్చనుండటం గమనార్హం. కూటమి ఏర్పాటును ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి నేడు లక్నోలోని ఓ హోటల్‌లో జరిగే ఉమ్మడి మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ విషయాన్ని ధ్రువీకరించిన అఖిలేశ్‌.. కాంగ్రెస్‌ను కలుపుకుని పోవడంపై సమాధానం దాటవేశారు. తమ కూటమిని చూసి బీజేపీతోపాటు కాంగ్రెస్‌ భయపడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు యూపీలోని 80 స్థానాల్లో చెరి 37 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ నియంతృత్వ పాలనకు ముగింపు పలకడమే ప్రతిపక్షాల లక్ష్యం కావాలి. కానీ, మమ్మల్ని వదిలేసి కూటమి ఏర్పాటు చేయడం చాలా ప్రమాదకరమైన పొరపాటు’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి అన్నారు.

కాంగ్రెస్‌కు అమేథీ, రాయ్‌బరేలీ సీట్లను మాత్రమే వదిలివేసేందుకు ఎస్‌పీ, బీఎస్‌పీ నిర్ణయించుకున్నట్లు వచ్చిన వార్తలపై యూపీ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజీవ్‌ బక్షి స్పందించారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగేందుకు సైతం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్‌పీ, బీఎస్‌పీ కూటమిలో చేరే విషయమై  ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌ సింగ్‌ స్పందించారు. తాము ఆరు సీట్లు కోరుతున్నామనీ, చర్చలు సాగుతున్నాయని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top