వంచన, బెదిరింపులే మోదీ తత్వం

Sonia Gandhi lashes out at Modi govt - Sakshi

మాయమాటలతో ప్రధాని ప్రజలను మోసం చేస్తున్నారు

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా ధ్వజం

న్యూఢిల్లీ: ప్రజలను మోసం చేయడం, వంచించడం, ప్రతిఘటించిన వారిని బెదిరించడమే ప్రధాని మోదీ తత్వమని కాంగ్రెస్‌ నేత, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దేశప్రజలు ఒక భయానక పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారని ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశ ప్రజాస్వామిక, లౌకిక పునాదులను మోదీ ప్రభుత్వం దెబ్బతీసిందని, రాజ్యాంగ విలువలను పాతిపెట్టి ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. మాయమాటలతో మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మాటలతో సమస్యలు పరిష్కరించలేరని, కార్యాచరణ ద్వారానే సమస్యలు పరిష్కార మవుతాయని అన్నారు.

ప్రజల స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం అదుపుచేస్తోందని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు ‘ఈశాన్య ప్రాంతం రగిలిపోతోంది, జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దళితుల, ఆదివాసీల, మైనారిటీల హక్కులకు భంగం కలుగుతోంది. రైతులు మనోవేదనలో ఉన్నారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపిం చడం లేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఊపిరిలూదాయని సోనియా అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ నాయకత్వాన్ని ఆమె సమర్థించారు. ‘రాహుల్‌ కొత్త శక్తితో ముందుకు వెళుతు న్నారు. అనుభవాన్ని, యువతరాన్ని ఆయన సమంగా వినియోగించుకుంటున్నారు’ అని కుమారుడిని ప్రశంసించారు. ‘ప్రత్యర్థులు అజేయంగా కని పించినప్పటికీ రాహుల్‌ తన పనితీరుతో కార్య కర్తలను ఉత్తేజపరిచారు. లక్షలాది కార్యకర్తల శ్రమ వృధా కాలేదని, విజయం సాధించడంలో వారి పాత్ర కీలకం’ అని ఆమె ప్రశంసించారు. సమావేశంలో రాహుల్‌తోపాటు మన్మోహన్‌ సింగ్, ఖర్గే, ఆజాద్‌ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top