‘సగం సీట్లు ఇవ్వకుంటే కూటమి కూలుతుంది’
ముంబై : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తమకు సగం స్ధానాలను ఇవ్వడంలో బీజేపీ విఫలమైతే కూటమి నుంచి వైదొలగుతామని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాల సమక్షంలో ఇరు పార్టీల మధ్య కుదిరిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ గౌరవించాలని స్పష్టం చేశారు. తమకు సగం సీట్లు కేటాయించని పక్షంలో ఇరు పార్టీల మధ్య పొత్తు పొసగదని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి రోట్ బుధవారం చేసిన వ్యాఖ్యలను సంజయ్ రౌత్ సమర్ధించారు. మరోవైపు శివసేనకు 124 స్ధానాలకు మించి ఇవ్వలేమని బీజేపీ చెబుతోందనే వార్తలతో శివసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒంటరి పోరుకు సిద్ధం కావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే పార్టీ శ్రేణులను కోరినట్టు తెలిసింది. నాగపూర్ సహా అన్ని స్ధానాల్లో పోటీకి ఆసక్తికనబరిచే అభ్యర్ధుల వడపోతకు శివసేన శ్రీకారం చుట్టింది.