అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్‌మాధవ్‌

Ram Madhav Says Good Relations Between CM Jagan And PM Modi - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు సీఎం వైఎస్‌ జగన్ ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవేం పెద్దవి కాదని అభిప్రాయపడ్డారు. అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుబట్టడం సరికాదని విమర్శకులకు హితవు పలికారు. దేవాదాయ ఆస్తుల విషయంలో సాధుసంతువుల కమిటీ ద్వారా.. నిర్ణయం తీసుకుంటామని సీఎం నిర్ణయించడం సంతోషకరమని రామ్‌మాధవ్ చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన  ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.
(చదవండి: బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది : ఇక్బాల్‌)

మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు.. వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని రామ్‌మాధవ్ అన్నారు. పార్లమెంట్‌లో నిర్ణయాలకు వైఎస్ఆర్‌సీపీ నుంచి మంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్‌ జగన్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒడిదుడుకులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, సీఎం జగన్ కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలతో పాటు, ఇతర అంశాలపై ఏపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీయే చెప్పారని రామ్‌మాధవ్‌ గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం సైతం నూతనంగా ఏర్పడిన ఏపీని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని ఆర్థిక సంఘం ఆలోచన చేసిందని ఆయన పేర్కొన్నారు. విభజన తర్వాత ఏపీ తక్కువ వనరులతో అవతరించింది రామ్‌మాధవ్ గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేయూత తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఏపీకి చెందినవాడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని రామ్‌మాధవ్‌ వెల్లడించారు.
(చదవండి: ఏపీలో కొత్తగా 33 పాజిటివ్‌ కేసులు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top