భావ విప్లవంతోనే  రాజ్యాధికారం | R Krishnaiah Talk To BC Rejuvenation In Warangal | Sakshi
Sakshi News home page

భావ విప్లవంతోనే  రాజ్యాధికారం

Aug 26 2018 11:55 AM | Updated on Aug 27 2018 2:54 PM

R Krishnaiah Talk To BC Rejuvenation In Warangal - Sakshi

 సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య

భావ విప్లవం తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. హన్మకొండ లోని కేయూ ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్‌ శతజయంతి ఉత్సవాల మహాసభలో ఆయన మాట్లాడారు.
 

కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని, ఐక్యంగా రాజ్యాధికారం సాధించుకునే దిశగా ప్రయత్నించాలని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఆర్‌. కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల ప్రధాత బీపీ మండల్‌ శతజయంతి ఉత్సవాల మహాసభ కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీపీ మండల్‌ పోరాటం ద్వారా సాధించుకున్న  బీసీలకు  27శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలోను క్రిమీలేయర్‌ విధానాన్ని అనుసరిస్తున్నారని, దీంతో ఎంతో మంది బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ లభించటం లేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్రిమీలేయర్‌ విధానాన్ని అమలు చేస్తుందని, దీంతో బీసీలకు నష్టం జరుగుతుందని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా.. అలాగే అమలు చేస్తున్నారని ఆరోపించారు. క్రిమీలేయర్‌ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాటాలు చేయాల్సి సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ చట్టబద్ధత కల్పించాలని ప్రధానీ నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లితే ఇటీవలనే చట్టబద్దత కల్పించారన్నారు. బీసీ కులాల మధ్య ఐక్యమత్యం లేకపోవడం వలనే మన ఓట్లు మనకు రావడం లేవని, తక్కువ ఓట్లు ఉన్న అగ్ర కులాల వారే అధికారంలోకి వచ్చి సీఎంలు అవుతున్నారన్నారు. ఇప్పటికైనా బీసీలు సమష్టిగా ఉండి బీసీ భావ విప్లవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.  బీసీ ఉద్యోగులు చోదకశక్తిగా పనిచేస్తూ గ్రామల్లోనూ, మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోను బీసీ సంఘాల కమిటీలు వేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నారు. అప్పుడే రాజ్యాధికారం సిద్దిస్తుందని అభిప్రాయపడ్డారు.

రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదు
బీసీ ఉద్యోగులకు, పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు అమలు కావాడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప అన్నట్లుగా బీసీలు తమ హక్కులు సాధన కోసం పోరాడాలన్నారు.  రాజ్యాధికారం సాధించే దిశగా కలిసికట్టుగా ముందుకుకెళ్దామన్నారు.వి ద్యుత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ ముత్యం వెంకన్నగౌడ్‌ మాట్లాడుతూ వి ద్యుత్‌ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్‌ చేశారు. పీఆర్‌సీని ప్రకటించి వర్తింపచేయాలన్నారు.

సీఎండి గా బీసీని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎన్‌పీడీసీఎల్‌ అధ్యక్షుడు పత్తి మధుసూధన్‌రావు, తెలంగాణ బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీలారంపు రాజేందర్, రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణ, తెలంగాణ విద్యావంతులవేదిక బాధ్యులు కోల జనార్ధన్, విద్యుత్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  కుమారస్వామి,  ఆర్టీసీ, రైల్వే, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘాల బాధ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్‌ ఉద్యోగ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ బీసీ లకు జరుగుతున్న అన్యాయాలను వివరిం చారు. అనంతరం బీసీల చైతన్య వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు. రామలింగయ్య బృందం పాడిన పాటలు ఉత్తేజం పరిచాయి. వివిధ జిల్లాల నుంచి విద్యుత్‌ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. తొలుతఅ తిథులు  బీసీ మండల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement