ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యం | Public welfare is the YSRCP goal | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యం

Mar 13 2018 2:04 AM | Updated on May 29 2018 4:40 PM

Public welfare is the YSRCP goal - Sakshi

హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పార్టీ గెలుపు ఖాయం అని పార్టీ శాసనసభాపక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమాగా చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆశయసాధనకు అందరం కంకణ బద్ధులై కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యన ఉంటూ, వారి తరఫున ఉద్యమాలు చేస్తూ పేదలకు అండగా నిలిచారన్నారు. ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ ఒక్కరే అని అన్నారు.

హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. చిత్రంలో భూమన, గంగుల ప్రతాప్‌రెడ్డి, రోజా, లక్ష్మీపార్వతి, కొండా రాఘవరెడ్డి, వాసిరెడ్డి పద్మ, ధర్మశ్రీ, ప్రపుల్లారెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, పద్మజారెడ్డి, సాయినాథ్‌రెడ్డి తదితరులు 

తెలుగువాడి సత్తా ఏంటో గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూపించిన దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ అని పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీని పురిట్లోనే చంపేయాలని ఢిల్లీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్‌ గుంటనక్కలు ప్రయత్నించాయని, అయినా వైఎస్‌ జగన్‌ పార్టీని ఒక శక్తిలా ముందుకు నడిపించారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలంతా జగన్‌ వెంటే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా కేకును కట్‌ చేసి, కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి,  పార్టీ మహిళా నేతలు లక్ష్మీపార్వతి, వాసిరెడ్డి పద్మ, పద్మజ, అమృతసాగర్‌ నేతలు ఆదిశేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, చల్లా మధుసూదన్‌రెడ్డి, బన్సూరీ మోహన్‌కుమార్, బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మేడపాటి వెంకట్, డాక్టర్‌ ప్రపుల్లారెడ్డి, కె.శివకుమార్, టి.రాజశేఖర్, నాగదేశి రవికుమార్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, బుర్రా సురేశ్‌ గౌడ్, బసిరెడ్డి బ్రçహ్మానందరెడ్డి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.   

జెండాను ఆవిష్కరించిన జగన్‌ 
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా ఈపూరుపాలెంలో పార్టీజెండాను ఆవిష్కరించి భారీ జనసందోహం మధ్య కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోన రఘుపతి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున పాల్గొన్నారు.  

వైఎస్సార్‌ పాలన అందించడమే జగన్‌ లక్ష్యం: వైఎస్సార్‌సీపీ ఎంపీలు 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలనను కొనసాగించాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించారని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ఇతర నేతలు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు.

కేక్‌ కట్‌ చేస్తున్న మేకపాటి, చిత్రంలో మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి,  వర ప్రసాదరావు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement