ఎమ్మెల్యే వైఫల్యంతోనే నీటి సమస్య 

The problem of water is the MLA's failure - Sakshi

బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌(వేములవాడ): వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు వైఫల్యంతోనే నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం మండలంలోని పోసానిపేట గ్రామంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటికి ప్రజలు, సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నా  ప్రభుత్వానికి చీమకుట్టినట్లయిన లేదని మండిపడ్డారు. కలిగోట సూరమ్మ రిజర్వాయర్‌ను నింపి అక్కడి నుంచి కథలాపూర్, మేడిపెల్లి మండలాల చెరువులకు నీరు వదలాలని ప్రజలతో కలిసి ఆందోళనలు చేసినా.. మా మాట వినకపోవడం, ప్రభుత్వానికి, పాలకులకు ముందుచూపు లేకపోవడంతో ఈ దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. మిషన్‌భగీరథ పథకాన్ని అడ్డుపెట్టుకొని నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోరుబావులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. సమావేశంలో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, బీజేవైఎం మండలాధ్యక్షుడు పులి హరిప్రసాద్, నాయకులు వెలిచాల సత్యనారాయణ, కాయితి నాగరాజు, ప్రసాద్, సురేశ్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top