
అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సులూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన...
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సులూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. ఎమ్మెల్యే కనగరాజ్ ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా 2016 మే నుంచి ఇప్పటివరకూ అయిదుగురు ఎమ్మెల్యేలు చనిపోయారు. శ్రీనివేల్, ఏకే బోస్ (తిరుప్పరంగుండ్రం), జయలలిత (ఆర్కే నగర్) కరుణానిధి (తిరువారూర్), కనగరాజ్ (సులూరు) అనారోగ్యంతో కన్నుమూశారు. వీరిలో నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కాగా, మరొకరు డీఎంకే చీఫ్.
ఎమ్మెల్యే కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 22 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పదిశాతం స్థానాలు ఖాళీగా ఉండటం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. 39 లోక్సభ స్థానాలతో పాటు, ఎమ్మెల్యేల మరణాలతో ఏర్పడ్డ ఖాళీలతో పాటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.