ఎన్నిసార్లు ఓడించినా ఆయనకు బుద్ధి రాలేదు

MLA Kakani Govardhan Reddy Open Challenge To TDP In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: వెంకటాచలం మండలంలో జరిగిన గొడవకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అది కేవలం కుటుంబ సభ్యుల మధ్య గొడవ మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయలేకే వైఎస్సార్‌ సీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. ఓటమిని అంగీకరించకుండా పబ్లిసిటీ కోసం డీజీపీ కార్యాలయం వద్ద బైఠాయించారని విమర్శించారు.

వెంకటాచలం ఘటనపై టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. గతంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగినా, హద్దు మీరినా మాట్లాడలేదు... కానీ కుటుంబ సమస్యల వల్ల దాడి జరిగితే దాన్ని మా పార్టీకి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. 2014లో జెడ్పీ చైర్మన్‌ ఎన్నికల్లో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన 10 సంవత్సరాల్లోనే పలు విజయాలు సాధించిందన్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేతో ప్రారంభించి 2019లో రికార్డు స్థాయిలో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. (‘షో బ్యాగ్‌.. సీ బ్యాగ్‌ అనేది చంద్రబాబు పాలసీ’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top