40 ఇయర్స్ ఇండస్ట్రీకి అంత బాధ ఎందుకో..?
చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఫైర్
సాక్షి, కాకినాడ: సొంత క్యాడర్నే కాపాడుకోలేకపోతున్న చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సోమవారం కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. ‘అచ్చెంనాయుడు మొదటి పులి అయితే..మీరు ఎన్నో పులి’ అని చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు చిప్(మెమరీ) పోయిందని.. ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిందని ఎద్దేవా చేశారు. ఎవరికి బలం ఉంటే వారిపై వాలిపోవడం తప్పా... చంద్రబాబు కు తన సొంత బలాన్ని తయారు చేసుకోవడం తెలియదన్నారు.
అంత బాధ ఎందుకో..
40 ఇయర్స్ ఇండస్ట్రీగా చంద్రబాబుకు ఉన్న అనుభవాన్ని హుందాగా వాడాలని హితవు పలికారు. ‘ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడవలేదని చంద్రబాబు చెప్పడం ఎంత నిజమో? చంద్రబాబును చూసి వైఎస్సార్ భయపడటం కూడా అంతే నిజం’ అన్నారు. ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేధాన్ని ఎత్తేసిన ఘనతతో పాటు.. మొదటి సంతకం బెల్టు షాపుల నియంత్రణ పై పెట్టి..వీధి వీధికి బెల్టు షాపులు పెట్టించిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. దశల వారిగా మద్యం నిషేధం అమలు చేస్తుంటే.. చంద్రబాబుకు అంత బాధ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కించపరిచేలా మాట్లాడితే సహించమని మంత్రి హెచ్చరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధిని చూసి నిధులు ఎక్కడా నుంచి వస్తున్నాయోనని అందరూ అశ్చర్యవ్యక్తం చేస్తున్నారని మంత్రి కన్నబాబు తెలిపారు.