
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల విషయంలో ఎన్నికల కమిషన్ ధృతరాష్ట్ర వైఖరిని అవలంబిస్తోందని పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి విమర్శించారు. ఓటర్ల జాబితాలో అనేక తప్పిదాలు ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ.. ప్రస్తుత ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే అసలు ప్రజాస్వామ్యానికి విలువే ఉండదన్నారు. పునర్విభజన చట్టం–2008లోని సెక్షన్–11 ప్రకారం మం డలాల పేరు, సరిహద్దులు, విస్తీర్ణం మారితే దానికి అనుగుణంగా చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే ఏపీలో కలిసిన 7 మండలాల విషయంలో ఇంతవరకు చట్టంలో ఎలాంటి సవరణలు చేయలేదని గుర్తు చేశారు. ఈ విషయమై ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్న తీరును ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ దృష్టికి తీసుకెళ్లమని తెలిపారు.