ఓటును నిరూపించుకునే సవాల్..!
సాక్షి, హుస్నాబాద్ రూరల్: పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను గుర్తించేందుకు గుర్తింపు పత్రాలు అవసరం. ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఫొటో గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా ఉండటం వల్ల ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని ఓటు వేయకుండా ఆయా పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరం చెప్తే ఓటు వేసేందుకు ఓటరు చాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎవరి గుర్తింపునైనా ఏజెంట్లు చాలెంజ్ చేయాలనుకుంటే ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయలు జమ చేయాలి. వారు సవాల్ చేసిన ఓటరు గుర్తింపు విషయంలో విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ తర్వాత వ్యక్తి గుర్తింపు నిర్ధారణ అయినట్టు సంతృప్తి చెందితే అతడిని ఓటు వేయనీయవచ్చు. ఓటరు జాబితలో పేర్లు తప్పుగా ఉంటే ఓటు వేసేందుకు ఇతర రాజకీయ పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్తే, ఓటరు ‘చాలెంజ్ ఓటు’ హక్కును ఉపయోగించుకోవచ్చు.
బోగస్ ఓటు అని తేలితే..
ఓటరు జాబితాలో పేరు ఉన్న ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అతని ఓటును ఇతరులు ఏవరైనా వేసినప్పుడు అక్కడ ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్పుతారు. అప్పుడు ఓటరు నేనే నిజమైన ఓటరును అని నిరూపించుకొనేందుకు చాలెంజ్ ఓటును ఎలక్షన్ కమిషన్ కల్పించింది.
– కె.అనంత్రెడ్డి, ఆర్డీవో
దీనికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయల రుసుం చెల్లించి విచారణ అనంతరం ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. విచారణలో ఓటరు బోగస్ అని తేలితే చట్టరీత్య చర్యలు తీసుకుంటారు.
ఓటరుపై విచారణ ఇలా..
బోగస్ ఓటరుపై సవాల్ చేసిన ఏజెంటు ఆ వ్యక్తిని అనుమానిస్తున్నందుకు రుజువులు చూపించాల్సి ఉంటుంది. తమ సవాల్ను సమర్థిస్తూ నిరూపణలు చూపలేని పక్షంలో సవాల్ను నిరాకరించవచ్చు. పోలింగ్ ఏజెంటు బోగస్ ఓటరుకు సాక్షాలను నిరూపిస్తే అతను ఓటరు కాదని నిర్ధారించిన తర్వాత ఓటరుకు నిరూపించుకొనే అవకాశం ఇవ్వాలి. దీనికి తాను ఓటరునని గుర్తింపును చూపిస్తే అతనిని ఓటు వేయనీయవచ్చు. అలా కాని పక్షంలో గ్రామ అధికారి ద్వారా లేదా ఇతర అధికారుల చేత గుర్తించవచ్చు. విచారణలో బోగసు ఓటరు అని తేలితే అక్కడే ఉండే పోలీసులకు అతనిని అప్పగించాల్సి ఉంటుంది. ఓటరు నిర్ధారణ జరిగితే ఓటు వేయనిస్తారు.