టికెట్ల కేటాయింపుపై కోమటిరెడ్డి హర్షం

Komati Reddy Venkat Reddy Expresses Elation On The Allocation Of Tickets - Sakshi

నల్గొండ: కోమటిరెడ్డి సోదరులు పంతం నెగ్గించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో ఏకంగా మూడు స్థానాలు సాధించి తమ సత్తా ఏమిటో చాటారు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్‌ నుంచి వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్య టికెట్లు సాధించారు. తొలిజాబితాలోనే తనతోపాటు తన సోదరుడికి, అనుచరుడికి టికెట్‌ ఖరారవ్వడంపై తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ టికెట్‌ల విషయంలో జాగ్రత్తలు పాటించిందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన సీట్లను బట్టి చూస్తే కచ్చితంగా మహా కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కుదిరిందన్నారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరంగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభలతో కొత్త జోష్‌ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కోమటిరెడ్డి సోదరులకు రుణపడి ఉంటా: చిరుమర్తి
కోమటిరెడ్డి సోదరుల ఆశీస్సులతోనే మళ్లీ తనకు టికెట్‌ దక్కిందని నకిరేకల్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తెలిపారు. జీవితాంతం కోమటిరెడ్డి సోదరులకు రుణపడి ఉంటానని ఉద్వేగంగా అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top