‘లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారని గౌరవిస్తున్నాం’

Kapil Sibal Slams On Speaker Om Birla In New Delhi - Sakshi

న్యూఢిల్లీ:  లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ ఘాటుగా స్పందించారు. రాజస్తాన్‌లోని కోటాలో జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనమంతా (బ్రాహ్మణ) ఐక్యంగా ఉండాలి. అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటాం. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నాం. సమాజాన్ని శాసించే స్థాయికి చేరు​కోవాలి’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి విధితమే. 

ఈ వ్యాఖ్యలపై కపిల్‌ సిబాల్‌ ‘పుట్టుకలోనే బ్రాహ్మణులకు గౌరవం ఉంటుంది. కానీ మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారని గౌరవం ఇవ్వడం లేదు. దేశంలోనే గౌరవప్రదమైన లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారని గౌరవం ఇస్తున్నామని’ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ కులంలో పుడితే మాత్రమే భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దగలమని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. 

ఓం బిర్లా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఓం బిర్లా ఈ ఏడాది జూన్‌లో లోక్‌సభ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.  రాజస్థాన్‌ నుంచి 2003, 2008, 2013 వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top