బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నడ్డా

JP Nadda Appointed BJP Working President - Sakshi

పార్టీ చీఫ్‌గా కొనసాగనున్న అమిత్‌

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా(58) బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డ్‌ సమావేశం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ వెల్లడించారు.  సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డ్‌ సెక్రటరీగా ఉన్న నడ్డా పార్టీ సంస్థాగత ఎన్నికల తర్వాత అధ్యక్ష బాధ్యతలు        చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా, బీజేపీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను నియమించడం ఇదే ప్రథమం..  

నడ్డాకు ప్రధాని అభినందనలు..
1960లో బిహార్‌ రాజధాని పట్నాలో జన్మించిన జగత్‌ ప్రకాశ్‌ నడ్డా విద్యాభ్యాసం అంతా పట్నా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో సాగింది. నడ్డా బీఏ ఎల్‌ఎల్‌బీ చదివారు. ఆయనకు భార్య డాక్టర్‌ మల్లిక, ఇద్దరు పిల్లలున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ గత మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. హిమాచల్‌లో 2007–12 కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన నడ్డాను ప్రధాని మోదీ, అమిత్‌ షా తదితరులు అభినందించారు. నడ్డా నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top