ఆ విష సంస్కృతికి బీజం వేసింది టీడీపీనే.. | GVL Narasimha Rao Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

దాడుల సంస్కృతికి బీజం వేసింది టీడీపీనే : జీవీఎల్‌

Feb 28 2020 5:41 PM | Updated on Feb 28 2020 5:56 PM

GVL Narasimha Rao Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : నాయకులను రోడ్లపై అడ్డుకునే విష సంస్కృతికి తొలుత బీజాలు వేసింది తెలుగుదేశం పార్టీయే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా గతంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. మోదీ.. గో బ్యాక్ అంటూ చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా వేసుకున్నారని, అమిత్ షా కాన్వాయ్‌పై రాళ్లదాడి కూడా చేశారని గుర్తుచేశారు. జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్న ప్రధాన మంత్రి మోదీ, అమిత్ షాపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రన్న రాజ్యాంగం అమలులో ఉండేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్న మరో విధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. (ప్రజాగ్రహానికి తలొగ్గిన చంద్రబాబు)

వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబును శుక్రవారం విశాఖ వాసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్‌ మాట్లాడారు.‘ గతంలో వైఎస్‌ జగన్, విజయసాయిరెడ్డి విశాఖ వెళ్ళినప్పుడు టీడీపీ నేతలు ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. వైజాగ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వాళ్లు ఏ పార్టీకి చెందిన వారో వాళ్ల చొక్కా మీద రాసి ఉండదు. అమరావతిలో టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని గతంలోనే తీర్మానం చేశాం. (ఉరిమిన ఉత్తరాంధ్ర)

హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడంపై త్వరలోనే న్యాయశాఖ మంత్రిని కలుస్తాను. రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తోంది. రాజధాని విషయంలో టీడీపీ నేతలు తమపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడంలేదు. ప్రజలను మభ్యపెట్టే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.ఢిల్లీలో అల్లర్లు వెనుక కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయి. అల్లర్లను ఢిల్లీ పోలీసులు సమర్థవంతంగా ఆపగలిగారు.’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement