
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ జోరును అడ్డుకునేందుకు ఎస్పీ, బీఎస్పీలు జట్టు కట్టనున్నాయా? తాజా ఘటనలు అవుననే చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్యల రాజీనామా కారణంగా జరుగుతున్న రెండు లోక్సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ పరోక్షంగా మద్దతు తెలిపింది.
బీజేపీని ఓడించగల అభ్యర్థికే తమ పార్టీ కార్యకర్తలు ఓటేస్తారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం ప్రకటించారు. అలాగే, త్వరలో జరగనున్న రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో అవగాహనకు వచ్చినట్లు మాయావతి చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలిచేలా ఎస్పీ సాయ పడుతుందనీ, అనంతరం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఆ పార్టీకి సాయపడేలా అవగాహన కుదిరిందన్నారు.