తొలి విజయం; అది అతి ప్రమాదకరం! | Giriraj SIngh On AIMIM Maiden Victory In Bihar Says Most Dangerous | Sakshi
Sakshi News home page

ఎంఐఎం బోణీపై కేంద్ర మంత్రి ట్వీట్‌!

Oct 26 2019 9:02 AM | Updated on Oct 26 2019 1:57 PM

Giriraj SIngh On AIMIM Maiden Victory In Bihar Says Most Dangerous - Sakshi

బిహార్‌లో ఎంఐఎం బోణీ... కేంద్ర మంత్రి ట్వీట్‌..... ఆయనకు అంత ప్రేమే ఉంటే రాజీనామా చేయొచ్చుగా..!

న్యూఢిల్లీ : బిహార్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లు అతి ప్రమాదకరమైన తీర్పు వెలువరించారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కిషన్‌గంజ్‌లో ఎంఐఎం గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. వందేమాతరాన్ని ద్వేషించే ఎంఐఎం పార్టీతో బిహార్‌లో సామాజిక సమగ్రతకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిహార్‌ ప్రజలు ఇక తమ భవిష్యత్‌ ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా గిరిరాజ్‌ సింగ్‌ ట్వీట్‌పై స్పందించిన జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మంత్రి శ్యామ్‌ రజాక్‌ ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు. ‘ ఒకవేళ గిరిరాజ్‌ సింగ్‌కు నిజంగా బిహార్‌ ప్రజలపై అంత ప్రేమే ఉంటే తక్షణమే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఇక అసదుద్దీన్‌ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ తాజా ఎన్నికల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. బిహార్‌లో బోణీ కొట్టి... కిషన్‌గంజ్‌(ఉప ఎన్నిక) అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఈ సందర్భంగా అసదుద్దీన్‌ మాట్లాడుతూ... ‘బిహార్‌లో మాకు దక్కిన తొలి విజయం ఎంతో కీలకమైంది. బీజేపీని ఓడించడమే కాదు.. కాంగ్రెస్‌ను కూడా మూడోస్థానానికే పరిమితం చేశాం. బిహార్‌ ఎంఐఎం అధ్యక్షుడు ఇమాన్‌ నాయకత్వం ఇలాగే కొనసాగాలి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎంఐఎం కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చి.. ఔరంగాబాద్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement