అభివృద్ధిలో గజ్వేల్‌ ఆదర్శం

Gajwel is in the forefront of development - Sakshi

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

గజ్వేల్‌ : సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం అభివృద్ధికి నమూనాగా మారిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌ మండలం దిలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూపతిరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లోని మంత్రి నివాసం వద్ద టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు సౌకర్యాలకు దూరంగా ఉన్న గజ్వేల్‌ రూపురేఖలు కేసీఆర్‌ ప్రాతినిథ్యంతో మారిపోయాయన్నారు. కొద్ది నెలల్లోనే ఈ ప్రాంతానికి రైలు కూడా రాబోతుందన్నారు. ఇందుకు సంబంధించి వేగంగా పనులు సాగుతున్నాయన్నారు. గజ్వేల్‌తో పాటు అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేయాలన్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకుడు దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top