
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా నటి, శశికళ వర్గానికి చెందిన సీనియర్ నేత సీఆర్ సరస్వతి... రజనీకాంత్పై మండిపడ్డారు. శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ కొత్త పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆదివారం చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న సీఆర్ సరస్వతి మాట్లాడుతూ ...రజనీకాంత్ కు రాజకీయ పరిపక్వత లేదని మండిపడ్డారు.
తూత్తుకుడి ఘటనలో సంఘ విద్రోహక శక్తులు చనిపోలేదని, సామాన్యులు మృతి చెందారని, నిజంగానే వారు హింసకు పాల్పడితే ఒక్క సంఘ విద్రోహక శక్తి ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. తమిళుల పోరాటాలను రజనీకాంత్ కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం ఆయన మానసిక పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలనలో పూర్తగా విఫలమైందని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై గొంతు విప్పేందుకు ఎమ్మెల్యే టీటీవీ దినకరన్కు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజు త్వరలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభను బహిష్కరించటం మంచిదికాదని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉండగా ప్రభుత్వ వైఖరి నచ్చక ఈ సెషన్స్ మొత్తం బహిష్కరించటం ద్వారా సామాన్యుల సమస్యలు మరుగున పడిపోతాయని సరస్వతి వాపోయారు.