గల్ఫ్‌ కార్మికులకు టీఆర్‌ఎస్‌ మొండిచెయ్యి | Congress Gulf NRI Division Convener Devender Reddy slams trs govt | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ కార్మికులకు టీఆర్‌ఎస్‌ మొండిచెయ్యి

Mar 3 2018 5:02 AM | Updated on Jul 6 2019 12:42 PM

హైదరాబాద్‌: కువైట్‌లో ఇబ్బంది పడుతున్న పేద ప్రవాసీ కార్మికులకు ఉచితంగా విమాన టికెట్లు ఇప్పిస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వారికి మొండిచెయ్యి చూపిందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నారై విభాగం ఆరోపించింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ఎన్నారై విభాగం చైర్మన్‌ బి.ఎం.వినోద్‌కుమార్, కాంగ్రెస్‌ గల్ఫ్‌ ఎన్నారై విభాగం కన్వీనర్‌ దేవేందర్‌ రెడ్డి, ప్రవాసీ సంక్షేమ వేదిక అధ్యక్షుడు భీంరెడ్డి మాట్లాడారు.

గల్ఫ్‌ కార్మికుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మరిచిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా నేతృత్వంలో ఎన్నారై బృందం గత నెల 16న కువైట్‌లో  భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చేసిందని చెప్పారు. ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను ఉల్లంఘించిన కార్మికులు తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తూ కువైట్‌ ప్రభుత్వం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు క్షమాభిక్ష అవకాశం కల్పించిందన్నారు. తమ బృందం అక్కడి అధికారులతో మాట్లాడి క్షమాభిక్ష గడువును ఏప్రిల్‌ 22 వరకు పొడిగించినట్లు తెలిపారు. చాలామంది పేదలకు చార్జీలూ తామే చెల్లించామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement