
చంద్రబోస్ (ఫైల్ ఫోటో)
కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ రాజకీయ హింసను ప్రోత్సహించడంలో పీహెచ్డీ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తీవ్రవాదుల సంస్థ అని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ హింసను ప్రేరేపించడంలో బెనర్జీ మాస్టర్స్, పీహెచ్డీ లాంటి పెద్ద డిగ్రీలు పూర్తి చేశారని చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
తృణమూల్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, మతాల మధ్య సీఎం మమత చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కార్యకర్తల చేతిలో యాబై మందికి పైగా ప్రజలు చనిపోయారని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను నామినేషన్ వేయకుండా తృణమూల్ అడ్డుకుందని చంద్రబోస్ పేర్కొన్నారు.