
మాట్లాడుతున్న బాలినేని
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా కపట నాటకాలు కట్టిపెట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద వామపక్షాలు చేపట్టిన బంద్లో ఆయన పాల్గొన్నారు. బాలినేని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వరప్రసాదినైన ప్రత్యేక హోదాను కాదని ఎవరికీ తెలియకుండా ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదిలోపే ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని టీడీపీ నాయకులు నిరసన ర్యాలీలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి, తద్వారానే పరిశ్రమలు వస్తాయని, అవి వస్తేనే నిరుద్యోగ యువతకు ఉపాది లభిస్తుందన్నారు. మరో వైపు జీఎస్టీ వంటి పన్నులు ఉండకపోవడం వల్ల వస్తువులు ప్రజలకు తక్కువ ధరకే లభ్యమవుతాయని వివరించారు.
దాని ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పారిశ్రామిక వేత్తలే తాము పరిశ్రమలు స్థాపిస్తామని ముందుకు వస్తారనే వాస్తవాన్ని కేంద్రం పట్టించుకోక పోవడంతో నేడు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు పార్లమెంట్లో తమ ఎంపీలు చేస్తున్న వాదనకు మద్దతుగా నిరసన దీక్ష చేస్తున్నామని చెబుతున్నారు తప్ప రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్రంతో మిత్రపక్షంగా తెగతెంపులు చేసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీకి ప్రేమే ఉంటే ముందుగా కేంద్రంలోని మంత్రులను ఉపసంహరించుకోవాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో టీడీపీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని, ఈ నేపథ్యంలో వామపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఇచ్చిన పిలుపుకు తాము కూడా మద్దతు తెలిపామని బాలినేని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మంగమూరు రోడ్డు, లాయరుపేట సాయిబాబా ఆలయం, జయరాం సెంటర్, సీవీఎన్ రీడింగ్ రూమ్, నగరపాలక సంస్థ కార్యాలయం, చర్చి సెంటర్ మీదుగా నెల్లూరు బస్టాండ్ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు బైకుపై ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. పలు కాలేజీల హాస్టల్ విద్యార్థులు పెద్ద ఎత్తున చేతులు ఊపుతూ బాలినేనికి జయజయధ్వానాలు పలికారు. దారిపొడవునా షాపులు మూసేయించారు. నెల్లూరు బస్టాండ్ నుంచి మళ్లీ కలెక్టరేట్ వద్దకు చేరుకొని వామపక్షాలు చేపట్టిన బంద్ కార్యక్రమానికి సంఘీభావం పలుకుతూ వారితో పాటు బైఠాయించి ప్రజలను ఉద్దేశించి బాలినేని మాట్లాడారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, రాష్ట్ర నాయకులు పురిణి ప్రభావతి, ధూళిపూడి ప్రసాద్నాయుడు, దేవరపల్లి అంజిరెడ్డి, పటాపంజుల శ్రీనివాసులు, వేమూరి సూర్యనారాయణ, వరికూటి కొండారెడ్డి, దామరాజు క్రాంతికుమార్, అన్నెం వెంకట్రామిరెడ్డి, యనమల నాగరాజు, గోలి తిరుపతిరావు, బడుగు ఇందిర, పోకల అనూరాధ, బడుగు కోటేశ్వరరావు, కొమ్ము శ్యామేలు, కొఠారి రామచంద్రరావు, కఠారి శంకర్, జజ్జర ఆనందరావు, కేవీ ప్రసాద్, మీరావలి, ఓబుల్రెడ్డి, చిన్నపురెడ్డి అశోక్రెడ్డి, మోరబోయిన సురేష్యాదవ్, రామకృష్ణారెడ్డి, రాయిని వెంకట్రావు, పల్లా అనూరాధ, యశ్వంత్వర్మ, కాకుమాను సునీల్రాజ్, జలీల్, రఫీ, వల్లెపు మురళి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, గోపిరెడ్డి గోపాల్రెడ్డి, అంగిరేకుల గురవయ్య, నత్తల భీమేష్, తోటపల్లి సోమశేఖర్, బాకా శివారెడ్డి, సువర్ణ, జమ్ము రత్తయ్య, వర్దు శేషయ్య పాల్గొన్నారు.