‘రైతు బీమా నమోదులో అలసత్వం వద్దు’ | Agriculture Secratary Warns Officers On Farmers Insurance | Sakshi
Sakshi News home page

‘రైతు బీమా నమోదులో అలసత్వం వద్దు’

Jul 20 2018 2:52 AM | Updated on Jul 20 2018 2:52 AM

Agriculture Secratary Warns Officers On Farmers Insurance - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రైతు బీమా నమోదులో ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జిల్లా వ్యవసాయ అధికారులతో రైతు బీమా నమోదు కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. బీమా నమోదు 73 శాతం (35,65,611 మంది) పూర్తయిందని, మిగతా నమోదును నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులు ఇచ్చే నామినేషన్‌ ఫారాల తనిఖీని మండల వ్యవసాయ అధికారులు పూర్తి చేసి, వివరాలను భారత జీవిత బీమా సంస్థకు అందజేయాలని సూచించారు. బీమా సంస్ధకు సమాచారం తొందరగా ఇస్తేనే ఆగష్టు 15వ తేదీన రైతులకు బీమా సర్టిíఫికెట్లను అందించడం వీలవుతుందన్నారు. రైతు బీమాలో నమోదు కాని రైతుల వివరాలను జిల్లా, గ్రామాల వారీగా ఎంఐఎస్‌ పోర్టల్‌లో పొందుపర్చామని, వాటిని గ్రామ పంచాయితీ ల్లోని నోటీసు బోర్డుల్లో అంటించాలన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో రైతుల వివరాలను కచ్చితంగా నమోదు చేయించాలని పార్థసారథి అధికారులకు సూచించారు.  

Advertisement
 
Advertisement
Advertisement