బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణ | Sakshi
Sakshi News home page

బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణ

Published Thu, Apr 12 2018 1:59 PM

Addanki Dhayakar Fires On TRS Party Leaders - Sakshi

శాలిగౌరారం (నకిరేకల్‌) : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాష్ట్రాన్ని బంగారు కాదు.. ఆత్మహత్యల తెలంగాణగా మార్చిందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్ధంకి దయాకర్‌ ధ్వజమెత్తారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలోనూ రైతన్నల పరిస్థితి తీవ్ర దుర్భిక్షంగా మారిందన్నారు.   రైతుల సంక్షేమం ప్రకటనలకే పరిమితం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలనుంచి గట్టెక్కలేక తీవ్ర ఇబ్బందికర పరిస్థితితుల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతుబంధు పథకం భూస్వామ్య పెట్టుబడిదారులకే ఎక్కువగా ఉపయోగపడేలా ఉందేతప్ప చిన్న, సన్నకారు రైతులకు  ప్రయోజనం లేదన్నారు. కౌలుదారులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేసినప్పుడే పేద రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేక కేసీఆర్‌ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తుందన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి 2019లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు చింత ధనుంజయ్య, గూని వెంకటయ్య, వంగూరి వెంకన్న, సత్తయ్య, బిక్షం, ప్రశాంత్, సురేశ్, నాగరాజు, మహేశ్, కిరణ్‌కుమార్, బడేసాబ్, నగేశ్, రాజేశ్, కిరణ్, శంకర్, నాగార్జున్, పరమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement