రైళ్లకు పసుపు రంగు వేయండి: ప్రపంచ బ్యాంకు
న్యూఢిల్లీ : దేశంలో రైల్వే ప్రమాదాలను నివారించేందుకు రైళ్లన్నింటికీ ప్రకాశవంతమైన పసుపు రంగును వేయాలని ప్రపంచ బ్యాంకు రైల్వే శాఖకు సూచించింది. రైల్వే ఉద్యోగులందరూ ప్రకాశవంతంగా ఉండే దుస్తుల్ని ఎల్లప్పుడూ ధరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ‘భారత రైల్వేల్లో భద్రతను పటిష్టం చేయడం’ అన్న అంశంపై ప్రపంచ బ్యాంకు నివేదికను సమర్పించింది. దేశంలో రైలు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాల్సిందిగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచ బ్యాంకు సహా పలు అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఈ నివేదికలోని ఇతర కీలకాంశాలు
♦ ప్రతి రైలులో అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలను ఏర్పాటు చేయాలి.
♦ ప్రమాదాల సమయంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను రూపొందించుకోవాలి.
♦ ప్రతి రైలు ముందు శక్తిమంతమైన డిచ్ లైట్లను ఏర్పాటు చేయాలి.
♦ ఉద్యోగులు ధరిస్తున్న హెల్మెట్లు, బూట్లు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అనుకూలమో? కాదో? పరిశీలించాలి.