లోక్‌సభకి రాహుల్‌పై సభ హక్కుల ఉల్లంఘన నోటీస్‌ | venkaiah forward privilege notice against rahul to lok sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభకి రాహుల్‌పై సభ హక్కుల ఉల్లంఘన నోటీస్‌

Jan 6 2018 4:29 PM | Updated on Jan 6 2018 4:29 PM

venkaiah forward privilege notice against rahul to lok sabha - Sakshi

న్యూ ఢిల్లీ : సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కొత్త చిక్కులు వెంటాడుతున్నాయి. రాహుల్‌ గాంధీపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాజ్యసభలో నమోదైన సభ హక్కుల ఉల్లంఘన నోటీస్‌ని ఛైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు, శనివారం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కి  పంపారు. అరుణ్‌ జైట్లీ పేరులోని జైట్లీని ఒత్తి పలికి అమర్యాదపూర్వకంగా అర్థం వచ్చేలా వ్యవహరించారని వారం క్రితం రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్‌ రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రివిలేజ్‌ మోషన్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై రాహుల్‌ అసభ్య పదజాలాన్ని వాడారని ఆరోపించారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యుడు కావడంతో ఈ ప్రివిలేజ్‌ మోషన్‌ని లోక్‌సభకు పంపారు.


వివరాల్లోకి వెళ్తే... గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై డిసెంబర్‌ 27న జైట్లీ రాజ్యసభలో వివరణ ఇస్తూ ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్‌, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని పేర్కొన్నారు.దీనిపై  రాహుల్‌ ట్విట్టర్‌లో  జైట్లీని.. జైట్‌-లై(అబద్ధాలకోరు) అని అభివర్ణించారు. మీకు ధన్యవాదాలు. మన ప్రధాని చెప్పిన పనులు అస్సలు చేయరని మీరు ఒప్పుకున్నందుకు సంతోషం అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement