అసెంబ్లీలో ఎమ్యెల్యేల గాఢనిద్ర

అసెంబ్లీలో ఎమ్యెల్యేల గాఢనిద్ర - Sakshi

ఓ వైపు దేశమంతటిన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే జీఎస్టీ బిల్లుపై చర్చ.. మరోవైపు ప్రతిపక్షాల రసాభాస అయినా  ఎమ్మెల్యేలకు నిద్రముంచుకొచ్చింది. వాళ్లేదో వారు చర్చించుకుంటారులే? మనకెందుకని ఏంచక్కా కొందరు ఎమ్మెల్యేలు కునుకు బాట పట్టారు.   ఈ సీన్ ఎక్కడో తెలుసా? బీజేపీ నేతృత్వంలో ఇటీవల పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తొలి అసెంబ్లీ సమావేశంలో. లక్నోలోని లోక్ భవన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం జీఎస్టీ బిల్లుపై చర్చ జరిగింది. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఎంచక్కా కూర్చున్న సీట్లలోనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలన్ని మొదటిసారి లైవ్ టెలికాస్ట్ చేశారు.

 

తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో చూసే అవకాశం ప్రజలకి ఇవ్వాలనే యోగి యోచన మేరకు తొలిసారి ఈ టెలికాస్ట్ ను చేపట్టారు. కానీ తీరా టీవీల ముందు కూర్చుని చూసిన జనాలకి ఈ స్లీపింగ్ సీన్లు దర్శనమిచ్చాయి. నిద్ర మత్తులో జోగుతున్న వారిలో ఆ రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారంట. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు హౌజ్ లో చూడవచ్చని ముఖ్యమంత్రి ఇంతకముందే చెప్పారు. తమ ప్రతినిధుల విషయంలో ముఖ్యమంత్రికి ఉన్న భరోసాకు భంగం వాటిలిస్తూ ఎమ్మెల్యేలు నిద్రపోవడం గమనార్హం. పార్లమెంట్ లో ఇప్పటికే జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాయి. వాటిని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించే ప్రక్రియలో ఉన్నాయి. ఈ బిల్లును ఆమోదించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటుచేస్తున్నాయి.  జూలై 1 నుంచి ఈ బిల్లు అమల్లోకి రానుంది.   

 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top