అనూహ్య మృతి; 70 లక్షల పరిహారం | Thoothukudi Custodial Death: AIADMK, DMK Give Rs 25 Lakh Each | Sakshi
Sakshi News home page

కస్టడీ మృతి; 70 లక్షల పరిహారం

Jun 27 2020 8:30 PM | Updated on Jun 27 2020 8:35 PM

Thoothukudi Custodial Death: AIADMK, DMK Give Rs 25 Lakh Each - Sakshi

బాధిత కుటుంబానికి పరిహారం అందిస్తున్న మంత్రి రాజు. జయరాజ్‌, బెనిక్స్‌ (ఇన్‌బాక్స్‌)

పోలీసు కస్టడీలో మరణించిన మృతుల కుటుంబానికి రూ. 70 లక్షల సహాయం

చెన్నై:  తమిళనాడులో పోలీసు కస్టడీలో మరణించిన మృతుల కుటుంబానికి అధికార అన్నాడీఎంకే పార్టీ 25 లక్షల రూపాయల సహాయాన్ని శనివారం ప్రకటించింది. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలోని సాత్తాన్‌కులం పోలీస్‌ స్టేషన్‌ కస్టడీలో మృతి చెందిన జయరాజ్‌(59), బెనిక్స్‌(31) కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయానికి ఇది అదనమని పేర్కొంది.

ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌ సందీప్‌ నందూరితో కలిసి సమాచార శాఖ మంత్రి సి. రాజు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీ కూడా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తరపున ఎంపీ కనిమొళి శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు చెక్‌ అందజేశారు. దీంతో బాధిత కుటుంబానికి మొత్తం రూ. 70 లక్షల పరిహారం ప్రకటించినట్టు అయింది. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’)

కాగా, ఈ దారుణ ఘటనపై తూత్తుకుడి ఎస్పీ శుక్రవారం మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌కు నివేదిక సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో  ఆయన కోర్టుకు వివరాలు తెలిపారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిందని, అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్నందున నివేదిక ఇంకా రాలేదని వెల్లడించారు. మరోవైపు జయరాజ్‌, బెనిక్స్‌ మరణానికి కారకులైన పోలీసులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. (తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి)

Advertisement
 
Advertisement
Advertisement