శబరిమలలో పది మంది మహిళలకు నో ఎంట్రీ..

 Ten Women Of Menstruating Age Were Sent Back From Sabarimala - Sakshi

తిరువనంతపురం : శబరిమల ఆలయం తలుపులు శనివారం సాయంత్రం తెరుచుకోనున్న క్రమంలో ఆలయం లోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు తిప్పిపంపారు. వీరిని ఏపీకి చెందిన మహిళా భక్తులుగా భావిస్తున్నారు. శబరిమలలో పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించవచ్చని, పూజలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆలయ పరిసరాల్లో పదివేల మంది పోలీసులను నియమించారు. కాగా శబరిమలను సందర్శించాలనే మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ స్పష్టం చేశారు. శబరిమల ఆలయం ఆందోళనలు చేపట్టే ప్రాంతం కాదు..తృప్తి దేశాయ్‌ వంటి సామాజిక కార్యకర్తలు తమ బలప్రదర్శన చేసే స్థలం కాదని చెప్పారు. ఏమైనా మహిళా భక్తులు కోర్టు ఉత్తర్వులతో రావాలని సూచించారు. మీడియా ప్రతినిధులు సైతం సంయమనం పాటించాలని, సంచలనం కోసం ప్రయత్నించే వ్యక్తులు, నేతల అత్యుత్సాహానికి సహకరించరాదని స్పష్టం చేశారు.

కాగా శతాబ్ధాల తరబడి రుతుక్రమం పాటించే మహిళలను శబరిమల ఆలయానికి అనుమతించని నిబంధనలను బేఖాతరు చేస్తూ సుప్రీం తీర్పు నేపథ్యంలో గత ఏడాది పూణేకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ శబరిమలలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.మరోవైపు నవంబర్‌ 20 తర్వాత తనకు ప్రభుత్వం భద్రత కల్పించకపోయినా శబరిమల సందర్శిస్తానని తృప్తి దేశాయ్‌ స్పష్టం చేశారు. తమకు భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరతానని, ప్రభుత్వం ఏ నిర‍్ణయం తీసుకున్నా దర్శనం కోసం తాను శబరిమల వెళ్లితీరతానని ఆమె చెప్పారు. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి యువతుల ప్రవేశం గురించి తాము న్యాయ సలహాను తీసుకుంటామని ట్రావన్‌కోర్‌ దేవసం బోర్డు అధ్యక్షుడు ఎన్‌ వాసు వెల్లడించారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top