ఆప్‌కు శరాఘాతం!  | Supreme Verdict On Power Sharing A Blow For APP | Sakshi
Sakshi News home page

ఆప్‌కు శరాఘాతం! 

Feb 15 2019 3:14 AM | Updated on Feb 15 2019 3:17 AM

Supreme Verdict On Power Sharing A Blow For APP - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్ల మధ్య అధికార పోరు కొత్తేమీ కాదు. కేంద్రంలో ఎన్డీయే, ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆధిపత్య పోరు మరింత పెరిగింది. కేంద్ర సర్వీసు అధికారులు తమ ప్రభుత్వ పనులకు నిత్యం అడ్డుతగులుతున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవా ల్‌ ఎన్నాళ్ల నుంచో ఆరోపిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో ప్రస్తుత ఎల్జీ అనిల్‌ బైజాల్, ఇంతకుముందు, ఎల్జీగా పనిచేసిన నజీబ్‌ జంగ్‌ విభేదించిన సందర్భాలు ఎన్నో ఉన్నా యి. కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఢిల్లీ పై కేంద్రానికి రాజ్యాంగం ప్రత్యేక అధికారా లు కట్టబెట్టడాన్ని ఆప్‌ సుప్రీంకోర్టులో సవా లు చేసింది. తాజా తీర్పుతో ఢిల్లీలో అధికార నియంత్రణపై కొంత స్పష్టత వచ్చిందనే చెప్పవచ్చు. చాలా అంశాల్లో ఎల్జీదే తుది మా ట అని ద్విసభ్య ధర్మాసనం చెప్పడం ఒకింత ఆప్‌ సర్కారుకు శరాఘాతమనే భావించాలి.  

ఆది నుంచీ ఆధిపత్య పోరు.. 
2015లో కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ఆధిపత్య పోరాటం మొదలయింది. అయితే దీనికి 2014లోనే బీజం పడింది. 2014లో కాంగ్రెస్‌ మద్దతుతో ఆప్‌ మొదటి సారి అధికారం చేపట్టింది. అవినీతి నిర్మూలన లక్ష్యంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్‌కు నచ్చలేదు. దీంతో సంకీర్ణం కొనసాగడం కష్టమని భావించిన కేజ్రీవాల్‌ 49 రోజులకే రాజీనామా చేశారు. ఏడాది రాష్ట్రపతి పాలన తరువాత మళ్లీ కేజ్రీవాల్‌ అధికారంలోకి వచ్చారు. శాసన సభలో 70సీట్లుంటే ఆప్‌ పార్టీ 67 స్థానాలు గెలుచుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేవలం మూడే స్థానాలే లభించాయి. దీంతో బీజేపీ తమ సర్కారుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందుకోసం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను వాడుకుంటున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. అప్పటి నుంచి అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం–లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల మధ్య అధికార పోరాటం సాగుతోంది.  

గత తీర్పుకు కొంచెం భిన్నంగా...
లెఫ్టినెంట్‌ గవర్నర్, ఆప్‌ సర్కార్‌ మధ్య అధికార పోరు కేసులో గత ఏడాది జులై 4న సుప్రీం కోర్టు కీలకతీర్పు ఇచ్చింది. ఎల్జీ అనిల్‌ బైజాల్‌కు ఏ విషయంలోనయినా సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని, ఆయన మంత్రి మండలి సలహా మేరకు నడుచుకోవాలని జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం అప్పట్లో స్పష్టం చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ‘అవరోధకుడిగా’వ్యవహరించరాదని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా మంత్రి మండలి తాను తీసుకునే నిర్ణయాలన్నింటినీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేసి తీరాలని పేర్కొంది. అయితే, ఆ నిర్ణయాలకు గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి కాదని తెలిపింది. ఈ విషయంలో నిరంకుశత్వానికి, అరాచకత్వానికి తావులేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మాత్రం భిన్నంగా స్పందిస్తూ భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు తుది నిర్ణయం తీసుకునే హక్కును ఎల్జీకి కట్టబెట్టింది. 

Advertisement
 
Advertisement
Advertisement